విద్యారంగానికి కేంద్ర బడ్డెట్ లో ప్రాధాన్యం ఎంత..?

విద్యతోనే బంగారు భవిష్యత్తు, విద్యతోనే దేశాభివృద్ధి, విద్యతోనే స్వావలంబన సాధ్యం. విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని కొఠారి కమిషన్ ఏనాడో చెప్పింది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని గుర్తు చేసింది. అంతే కాదు.. జీడీపీ లో 6 శాతం విద్యారంగానికి కేటాయించాలని 1968లోనే స్పష్టం చేసింది. ఆ తర్వాత ఏర్పాటైన కమిటీలు, కమిషన్లు, విద్యకు సంబంధించి విధాన పత్రాలు కూడా ఈ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించాయి. కానీ కొఠారి కమిషన్ సూచనల మేరకు 1999 మినహా ఏ నాడూ నిధుల కేటాయింపు, జీడీపీలో 4.15 శాతం దాటిన దాఖలాలు లేవు. దాదాపు 3.1 శాతం వద్దే కేటాయింపులు నిలిచిపోయాయి.

 

జాతీయ విద్యావిధానం(NEP)-2020 ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తిరిగి విద్యారంగం ప్రాధాన్యతను గుర్తించినట్లుగా చెప్పుకోవాలి.విద్యా కేటాయింపుల మొత్తం జీడీపీలో 6 శాతానికి చేర్చేందుకు కృషి చేస్తామని పునరుద్ఘాటించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఎప్పటిలోగా చేరుకుంటామన్న ప్రస్తావన మాత్రం లేదు.

 

పడిపోయిన సామర్థ్యం

పాఠశాల విద్యలో గణితంతో పాటు ఆంగ్లం, తెలుగు సబ్జెక్టులు కీలకం. ఈ రెండింటిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం సన్నగిల్లడం ఆందోళనకర విషయమే. చదవడంలో, గణించడంలోనూ విద్యార్థుల సామర్థ్యం 2012 నాటి స్థాయికి పడిపోయిందని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (అసర్‌ నివేదిక) నిర్ధారించింది. కరోనా మహమ్మారి కారణంగా పిల్లల అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావితమైందని తెలిపింది.

 

2018-22 మధ్య దేశవ్యాప్తంగా 7 లక్షల మంది విద్యార్థులను సర్వే చేసి మరీ.. నిగ్గు తేల్చారు. కరోనాతో దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూతపడడంవల్ల విద్యాభ్యాసం విషయంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. దీనికి సంబంధించి విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది.

 

బాలికలకు ప్రోత్సాహం కరువు

ప్రభుత్వం దృష్టి సారించాల్సిన మరో ప్రధాన సమస్య బాలికా విద్య(గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్). 11-16 ఏళ్ల విద్యార్థినుల్లో చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. బాలికల్లో డ్రాపవుట్లను తగ్గించడానికి, బాలికా విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో 2008-09 నుంచే పథకాలు చేపట్టారు. కానీ ఫలితాలు నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. 2022 గణాంకాలను చూస్తే.. పట్టణ బాలికల్లో 23.5% మాత్రమే స్కూళ్లల్లో చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా..

పరిశ్రమల అవసరాల తగ్గట్టు విద్యావిధానం లేకపోవడం పెద్దలోటు. యువత అత్యధికంగా ఉన్న దేశం మనదే. ఆ యువశక్తిని వినియోగించడం ద్వారా దేశ ఉత్పాదకతను పెంచి దేశాన్ని సుసంపన్నం చేయొచ్చు. కానీ ప్రస్తుత విద్యావిధానం.. వారికి ఉపాధి కల్పించలేకపోతోంది. ఏటా గ్రాడ్యుయేట్లు అవుతున్న వారిలో మూడోవంతు మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మిగతా రెండొంతుల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగితకు ఊతమిస్తున్న ఈ పరిస్థితిని తక్షణమే చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

 

నైపుణ్యం ఏదీ?

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నిపుణులను తయారు చేసేలా విద్యావిధానాన్ని పరిపుష్టం చేయాలి. అత్యధిక విద్యార్థుల్లో నైపుణ్య లేమి ఈ రోజు మన దేశంలో అతి పెద్ద సమస్య. గ్రామీణ విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. స్కిల్ డెవలప్‌మెంట్ వారికి అందని పండుగానే మిగిలింది. డిజిటైజేషన్ దిశగా దేశం అడుగులేస్తున్న క్రమంలో యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుని.. భారతీయులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలి.

 

ఏం చేయాలి?

విద్యారంగానికి నిధులను కేటాయిస్తున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఆ బడ్జెట్‌ను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్‌, స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్‌లకు మరిన్ని నిధులు కేటాయించాలి. జాతీయ విద్యా విధానం(NEP) లక్ష్యాలకు అనుగుణంగా ఉచిత ట్యూషన్లకు అవకాశం కల్పించాలి. లేదంటే ట్యూషన్ల లో రాయితీ అందజేయాలి.

 

నిధుల కేటాయింపు ఇలా..

 

సంవత్సరం—కేటాయింపు——-వ్యత్యాసం—-వ్యత్యాసం

————(రూ.కోట్లలో)—–(గత బడ్జెట్‌తో..)–(శాతం)

2017-18 81,868 – –

2018-19 85,010 3,142 3.84

2019-20 94,854 9,844 11.58

2020-21 99,312 4,458 4.7

2021-22 93,224 -6,088 -6.13

2022-23 1,04,278 11,052 11.86

 

2024 సంవత్సరంలో లోక్ సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ గణంకాలు లెక్కలోకి తీసుకోలేదు. జూలై 2024లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *