ఎన్నికల్లో బయో మెట్రిక్ గుర్తింపును తప్పనిసరి చేయాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఇలా చేస్తే నకిలీ ఓట్లకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు అర్హత ఉన్న అంశమని అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం సాధించిన పార్టీలపై ప్రతిపక్షాలు దొంగ ఓట్ల సాయంతో గెలిచాయంటూ ఆరోపణలు గుప్పించే విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు లేదా కంటి సంబంధిత బయో మెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లు చేయాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఈ పిటిషన్ వేశారు. ఒకరికి బదులు మరొకరు ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయని, డూప్లీకేట్, గోస్ట్ ఓటింగ్ వంటి అక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు.
వీటిని అరికట్టాలంటే పోలింగ్ బూత్ ల వద్ద బయో మెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ ను అమలు చేయాలని కోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే నకిలీ ఓట్లకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశం విచారణకు అర్హమైందని పేర్కొంది. అభిప్రాయాన్ని తెలియ చేయాలంటూ భారత ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
అదే సమయంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దీనిని అమల్లోకి తీసుకు రావాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై కూడా ధర్మాసనం స్పందించింది. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదంటూ తోసిపుచ్చింది. అయితే భారత ఎన్నికల సంఘం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల తరువాత ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈవీఎంల అవకతవకల అంశం, ఎన్నికల కమిషన్ పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో బయో మెట్రిక్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎన్నికల ప్రక్రియలో చేర్చవచ్చా? అన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలనుకోవటం విశేషం.