భారత్‌తో చారిత్రాత్మక పోరుకు జపాన్ టీమ్ రెడీ.. కెప్టెన్‌గా కెండెల్!

టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ భారత్‌తో జపాన్‌ చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 22న సనో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ కోసం తమ జట్టును జపాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (JCA) ప్రకటించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది.

జపాన్‌ జట్టుకు కెండెల్‌ కడోవాకీ ఫ్లెమింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జపాన్‌ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న కెండెల్‌తో పాటు 50కిపైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇబ్రహీం తకహాషి, డెక్లాన్‌ సుజుకి-మెక్‌కాంబ్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. యువ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జేక్‌ కుసుడా-నెయిర్న్‌ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

అనుభవజ్ఞుడైన సుయోషి తకాడా కూడా చాలా కాలం తర్వాత జపాన్‌ జట్టులోకి తిరిగి వచ్చాడు. 2013లో ఐసీసీ ఈస్ట్‌ ఏషియా-పసిఫిక్‌ టీ20 ఛాంపియన్‌షిప్‌లో జపాన్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన తకాడా.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. దీంతో భారత్‌తో జరిగే ఈ మ్యాచ్‌ జపాన్‌ క్రికెట్‌కు ప్రత్యేకమైన ఘట్టంగా మారనుంది.