మమితా బైజు సెన్సేషనల్‌ రికార్డ్‌.. దీపికా, ఆలియా సరసన చేరిన మలయాళ కుట్టీ!

మాలీవుడ్‌ బ్యూటీ మమితా బైజు అరుదైన రికార్డుతో సౌత్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు రూ.200 కోట్ల సినిమాలు అందించిన హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీస్‌ దీపికా పదుకొణే, ఆలియా భట్‌ సరసన చోటు దక్కించుకుంది. 2013లో దీపికా నటించిన ‘యే జవానీ హై దీవానీ’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘రామ్‌లీలా’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. 2022లో ఆలియా నటించిన ‘గంగూభాయ్‌ కతియావాడి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఈ ఘనతను అందుకున్నాయి.

‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న మమితా బైజు.. ఈ ఏడాది వరుస విజయాలతో తన మార్కెట్‌ను మరింత పెంచుకుంది. ఆమె నటించిన మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘జన నాయగన్‌’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా భారీ వసూళ్లు రాబట్టగా.. ఆగస్టులో విడుదలైన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’, ‘బెత్లెహం కుడుంబ యూనిట్‌’ సినిమాలు కూడా రూ.200 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. దీంతో ఒకే ఏడాదిలో హ్యాట్రిక్‌ రూ.200 కోట్ల సినిమాలు అందించిన తొలి సౌత్‌ హీరోయిన్‌గా మమితా బైజు నిలిచిందనే టాక్‌ వినిపిస్తోంది.

ఈ వరుస విజయాలతో మమితా బైజు రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటివరకు సుమారు కోటి రూపాయలు తీసుకుంటున్న ఆమె.. ఇకపై రూ.3 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుస హిట్లు ఆమె కెరీర్‌కు బిగ్‌ బూస్ట్‌ ఇచ్చినప్పటికీ.. ఇకపై చేయబోయే సినిమాలపై అంచనాలు, ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ సక్సెస్‌ జోష్‌ను మమితా తన తదుపరి చిత్రాల్లోనూ కొనసాగిస్తుందో చూడాలి.