మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన ‘పెద్ది గ్రాండ్ రోర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో రామ్చరణ్ మాట్లాడిన మాటలు, అభిమానులపై ఆయన చూపించిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మీ కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు.. రక్తం చిందించైనా పని చేస్తాను!
ఈవెంట్లో రామ్చరణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. “ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు ఉన్న ఒకే ఒక్క బలం, ధైర్యం నా మనసులో ఉన్న మీరే. మీ కోసమే నేను సినిమాలు చేస్తున్నాను. ఏ ఆర్టిస్ట్కైనా అభిమానుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఎంకరేజ్మెంట్ లేకపోతే సినిమాలు ఎందుకు చేయాలి? హ్యాపీగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. కానీ మీకోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు.. అవసరమైతే రక్తం చిందించైనా సరే కష్టపడి పని చేస్తాను” అంటూ మెగా అభిమానులపై తనకున్న అపారమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా.. రాసి పెట్టుకోండి!
సినిమా ఇండస్ట్రీపై, ప్రేక్షకులపై తనకున్న అంకితభావాన్ని చెప్తూ.. “మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా? లేక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి మీకు ఏదైనా ఇవ్వాలనే తపనా? అనేది నాకు తెలియదు. మా నాన్నగారి (చిరంజీవి) కొడుకుగా పుట్టినందుకు, ఇంట్లో కల్యాణ్ బాబాయ్ (పవన్ కల్యాణ్) గారు ఉన్నందుకు.. నాకు సినిమా, సినిమా, సినిమా.. ఇది తప్ప మరేమీ తెలియదు. బహుశా వేరేది ఏదైనా తెలిసి ఉంటే నేను ఈ ఫీల్డ్లో ఇంత పెద్ద ఆర్టిస్ట్ని అయ్యేవాడిని కాదేమో. నా ప్రాణం ఉన్నంత వరకు, నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను.. ఇది రాసి పెట్టుకోండి” అంటూ రామ్చరణ్ ఇచ్చిన స్టేట్మెంట్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది.
‘మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్ళీ ఆ వైబ్స్!
‘పెద్ది’ సినిమా కథ గురించి చెప్తూ.. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి, కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు తన గుండెకు హత్తుకుపోయిందని చరణ్ అన్నారు. ఇలాంటి కథలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన లైఫ్ లాంగ్ సినిమా లైబ్రరీలో ఇది వన్ ఆఫ్ ది టాప్ ఫిలింగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తనకు ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్, వైబ్స్ వచ్చాయో.. మళ్లీ ‘పెద్ది’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడు సెట్స్కి వెళ్దామా అనే అంతటి ఎక్సైట్మెంట్ కలిగిందని పేర్కొన్నారు.
కింద పడిపోయిన ఒక సాధారణ మనిషి మళ్లీ లేచి ఎలా నిలబడ్డాడు, తన ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా కథ అని, దర్శకుడు బుచ్చిబాబు భవిష్యత్తులో ఇండియాలోనే టాప్ 3 డైరెక్టర్లలో ఒకరిగా నిలుస్తారని చరణ్ ప్రశంసించారు. జూన్ 4న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.