అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని.. ఈ ఒప్పందం రద్దు చేసేంత వరకు అవసరమైతే మరో రైతు మహోద్యమాన్ని చేపడుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం)ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా చేసుకున్న అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.
పశ్యపద్మ మాట్లాడుతూ..
ఈ ఒప్పందం ఇదేవిధంగా కొనసాగిస్తే దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణించి అన్నదాతల జీవితాలు పూర్తిగా చీకటిమయం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారితమైన ఈ దేశ జనాభాలో( 50 శాతం మంది) సుమారు 14 కోట్ల రైతు కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం రైతాంగానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మనదేశం నుంచి అమెరికాలాంటి వి దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తే 30 శాతం నుంచి 150 శాతం మేర ఉన్న సుంకాలు ఉండేవని, ఈ ఒప్పందంతో మొత్తం ఎత్తివేశారన్నారు.
తీవ్ర ఆర్ధిక సంక్షోభం
దీంతో రైతాంగం పండిస్తున్న వరి, గోధుమ, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పసుపు మిర్చి నూనె గింజలతో సహా అన్ని రకాల పంటకు కనీస మద్దతు ధర కూడ రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో దేశ రైతాంగమంతా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడే ఒప్పందాలను చేసుకునే హక్కును కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎస్కేఎం నాయకులు కె.సూర్యనారాయణ, సుదర్శన్, దేవారామ్, కోటేశ్వరరావు,ఇంద్రసేనా, తుకారామ్ నాయక్, సనప పొమ్మయ్య, సదానందం అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పశ్యపద్మ, టి.సాగర్, బి.రాము, బిక్షపతి, జంకుల వెంకటయ్య, ఎన్రెడ్డి హంసారెడ్డి, బి.వెంకటేశ్వర్లు, వి.నాగిరెడ్డి, ఎ.సాయన్నపాల్గొన్నారు.