ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురంకు చెందిన తలపాటి సూర్యకాంత్ అనే వ్యక్తి భార్య రేణుక ఏడు నెలల గర్భిణీగా ఉన్నప్పుడే కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవల పిల్లల్లో ఓ బాలుడి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు మార్చి 4వ తేదీన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించే క్రమంలో, కాన్యులా ఏర్పరచిన స్థలంలో వాపు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినా కానీ పెద్ద సమస్య కాదని వైద్య సిబ్బంది దాటేశారని, ఎన్ని రోజులైన వాపు తగ్గకపోవడం, చేయి నల్లగా మారడంతో మరో సారి నిలదీయగా, వెళ్లి ప్రైవేటులో స్కానింగ్ తీసుకొని రండి అంటూ వైద్యులు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని వాపోయారు.
వైద్యుల నిర్లక్ష్యం..
చిన్నారి చేతి కణజాలాలు దెబ్బతిని, చేయి పూర్తిగా దెబ్బ తిన్నదని స్కానింగ్ రిపోర్టులో రావడంతో బాలుడి తల్లిదండ్రులు డాక్టర్లను నిలదీసారు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి వెళితే వెంటనే నయం చేస్తారని చెప్పడంతో, మార్చి 26వ తేదీన నిలోఫర్ ఆసుపత్రికి తరలించామని, అక్కడి వైద్యులు బాలుడి చేయి పూర్తిగా దెబ్బ తిన్నదని, చేతిని తొలగించాలని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయినంత పనైంది. చేసేదేమీ లేక బాలుడి చేయి తొలగించేందుకు అంగీకరించిన బాలుడి తల్లిదండ్రులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు వికలాంగుడిగా మారాడని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.