కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించేందుకు ‘దిశ’ సమావేశం ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖలో నిర్వహించిన దిశ సమావేశంలో 33 విభాగాలకు చెందిన అధికారులతో కలిసి పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విశాఖను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి రూ.1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరైనట్లు శ్రీభరత్ ప్రకటించారు. ఇందులో భాగంగా మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, నగర నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి కీలక పనులను చేపట్టబోతున్నట్లు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో అభివృద్ధి పనులు పూర్తిగా మందగించాయని శ్రీభరత్ విమర్శించారు. అనేక కీలక ప్రాజెక్టులను పక్కనపెట్టడం వల్ల వాటి నిర్మాణ వ్యయం ప్రస్తుతం భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన పనులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త పథకాల ద్వారా తిరిగి ముందుకు తీసుకువస్తోందని స్పష్టం చేశారు. అలాగే విశాఖ బీచ్లలో లభించే ఖనిజ సంపదను కూడా త్వరలోనే వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.