నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, ఇది దేశ భవిష్యత్తుతో ముడిపడిన సమస్య అని ఆయన స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు, పరీక్షల భద్రతపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని తెలిపారు.
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ, నీట్ పేపర్ లీక్ను రాజకీయ అంశంగా మార్చకూడదన్నారు. ఇది ఒక రాష్ట్రానికి లేదా కేంద్ర ప్రభుత్వానికే పరిమితమైన విషయం కాదని, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే జాతీయ సమస్య అని పేర్కొన్నారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. యువత భద్రత, వారి భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన చెప్పారు. అలాగే పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని, రాజకీయ విభేదాలు ఉన్నా దేశ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మోదీ పేర్కొన్నారు.