భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. శత్రు దేశాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని స్పష్టం చేశారు.
పటిష్ఠంగా వ్యూహాలు
ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచుతున్నట్లు ద్వివేది తెలిపారు. యుద్ధరంగంలో ప్రతి కదలిక స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అందుకే సైనికులతో పాటు పౌరుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 24 గంటలూ రక్షణ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని వివరించారు.
సమాచార యుద్ధంలో ప్రజల పాత్ర
సమాచార యుద్ధంలో విజయం సాధించాలంటే దేశ ప్రజల మద్దతు ఎంతో అవసరమని జనరల్ ద్వివేది పేర్కొన్నారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని పిలుపునిచ్చారు. దేశమంతా ఒకే తాటిపైకి వచ్చినప్పుడే శత్రువుపై విజయం సాధ్యమవుతుందని వివరించారు.