ఆగస్టు 15న మూడవ విడత రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల రోజు వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గోదావరి జలాల విడుదల కార్యక్రమానికి సంబంధించిన సభలోనే రుణమాఫీ ప్రారంభిస్తారని చెప్పారు. మూడవ విడతలో సుమారు. 6 వేల మంది రైతులకు దాదాపు 6 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని అన్నారు.
సాంకేతిక కారణాల వల్ల రెండు విడతల్లో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లన్నీ సరి చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ఆరోపణలు, అనుమానాలు, అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమని తెలిపారు. రైతాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ది పొందలేరని తెలిపారు. ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలు చేయవద్దన్న ఆయన.. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించి రైతుల మనో భావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు.