బీఆర్ఎస్ నుంచి మరో ఆరుగురు..? విలీనం తప్పదా..?

వరుస దెబ్బలతో బీఆర్ఎస్ రోజురోజుకూ కుదేలవుతోంది. ఎంతగా కట్టుదిట్టం చేసినా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రస్తుతం 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఆ పార్టీలో. సీఎం రేవంత్ రెడ్డి పంతం పట్టారు. ఎలాగైనా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలనందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు..ఆ పార్టీలో మరో పది మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తే పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే మరిన్ని వలసలు ఉంటాయని అనుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్రనేతలు తమ పార్టీ వారిని బుజ్జగిస్తున్నారు. ఇకపై వలసలు లేకుండా జాగ్రత్వ వహించాలని ..ముందుగానే వారితో సంప్రదింపులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారని పుకార్లు రావడంతో సబితను పార్టీ మారకుండా చేయగలిగారు.

 

ఫిరాయింపుల చట్టం

 

పార్టీ మారిన అభ్యర్థులపై ఫిరాయింపుల చట్టం అమలు చేయాలని చూస్తున్నారు. నయానో భయానో చెప్పి ఉన్న ఎమ్మెల్యేలు జారీపోకుండా చేద్దామనే యోచనలో ఉన్నారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బీఆర్ఎస్ అగ్రనేతల గుండెల్లో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు జారిపోతారనే భయం పట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో ఎవరెవరు ఎమ్మెల్యే లు అనుచితంగా ప్రవర్తించారో, ఎవరెవరు అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారో, సమావేశాలకు ఆటంకం కలిగించిన వారెవరో అనేది సీసీ కెమెరాల ఆధారంగా నివేదికలు తయారవుతున్నాయి. కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంయమనం కోల్పోయి సభలో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వీరందరిపై లిస్ట్ రెడీ అవుతోంది. రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. వారంతా పదేపదే సభా నియమాలు ఉల్లంఘించారంటూ త్వరలోనే వారిపై వేటు పడనుందని అనడంతో బీఆర్ఎస్ లీడర్లు అదిరిపోతున్నారు.

 

వేటు ఎవరిపైనో?

 

ఎవరిపై వేటు పడనుందో..ఎవరెవరి సభ్యత్వం రద్దు కానుందో అని ఆందోళన పడుతున్నారు. గతంలో కేసీఆర్ చేసిన పనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా చేయబోతున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో నాటి సీఎంగా ఉన్న కేసీఆర్ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. దాని ప్రకారం సభ్యత్వాలను కోల్పోయారు నాటి కాంగ్రెస్ నేతలు. వీరిలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు ఉన్నారు. నాటి స్పీకర్ వీరి సభ్యత్వాలను రద్దు చేశారు. సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని..సభా మర్యాదలు పాటించలేదనే సాకుతో వీరి సభ్యత్వాలను రద్దు చేశారు.

ఇప్పుడు కూడా కేసీఆర్ అనుసరించిన వ్యూహమే సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తారా అని అంతా అనుకుంటున్నారు. రేవంత్ వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేవిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సభ్యత్వం కోల్పోతే బీఆర్ఎస్ బలం 23కు పడిపోతుంది. ఇంక ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే ఛాన్స్ ఉంది.

 

విలీనం తప్పదా?

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్ నెలలో ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ సమావేశాలు కూడా తొమ్మిది రోజులు జరిగాయి. ఈ సమావేశాలలో స్పీకర్ విధులకు ఆటంకం కలిగిస్తూ కొంరు బీఆర్ఎస్ నేతలు సభా నియమాలను ఉల్లంఘించారు. సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్ల ప్రవర్తన అంతా ఇప్పుడు సీసీ కెమెరాల సాయంతో పరిశీలించి స్పీకర్ వీరి సభ్యత్వాల రద్దు నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *