వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్ లో అద్భుతం..

కేరళలోని వయనాడ్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 316 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటిలో పదులసంఖ్యలో మృతదేహాల వివరాలు ఇంకా తెలియలేదు. కొన్నిమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినా ఇంకా మార్చురీలోనే ఉన్నాయి. రెండు గ్రామాలు పూర్తిగా కొండచరియల కింద నేటమట్టమైపోయాయి. బురద తవ్వే కొద్దీ శవాలు బయటపడుతుండటంతో.. వయానాడ్ శవాలదిబ్బగా కనిపిస్తోంది. ఎటుచూసినా మృత్యుఘోషే వినిపిస్తోంది.

 

ఇంతటి తీవ్రవిషాదంలో.. వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్ లో ఓ అద్భుతం వెలుగుచూసింది. నాలుగు రోజుల తర్వాత నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. పడవెట్టికున్నులో ఆర్మీ సైన్యం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను కాపాడింది. ఆ నలుగురూ మృత్యుంజయులుగా నిలిచారు. శిథిలాల కింది నుంచి వారిని రక్షించిన సైన్యం.. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది.

 

మరోవైపు చెలియార్ నదిలోనూ హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదలలో కొట్టుకుపోయినవారిలో ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ? మిస్సైన వారిలో ఇంకా ఎవరి ఆచూకీ అయినా తెలియాల్సి ఉందా ? అన్న కోణంలో రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు.

 

పుంచిరిమట్టంలో కనిపిస్తోన్న హృదయ విదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. మృతదేహాలను వెలికి తీసేందుకు స్నీపర్ డాగ్స్ సహాయం తీసుకుంటున్నారు రెస్క్యూ సిబ్బంది. 6 స్నీపర్ డాగ్స్ తో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆ శునకాలకు నెత్తుటివాసనను పసిగట్టేలా ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దించారు. ఇప్పటి వరకూ 10 మృతదేహాలను గుర్తించాయి శునకాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *