కేటీఆర్, హరీష్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?

ఓ పక్క ఓటమి, మరో పక్క వలసలు వరుసగా బీఆర్ఎస్ పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బుజ్జగిస్తున్నా వలసలు ఆగడం లేదు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రంగం సిద్దంచేసుకుంటున్నారు. దీనితో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 80 కి చేరువలో ఉండనుంది. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ అండ్ కో తమ వద్ద ఉన్న ఆఖరి అస్త్రం ప్రయోగించనుంది. గత ఐదు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు కేటీఆర్, హరీష్ రావు. కవిత బెయిల్ కోసం అంటున్నారు పార్టీ నేతలు. అయితే అసలు కారణం వేరేది ఉంది. వరుసగా వలస వెళ్లిపోతున్న నేతలను న్యాయపరంగా ఎలా అడ్డుకోవాలి? ఇప్పటికే వెళ్లిపోయిన నేతలను ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా దారికి తెచ్చుకోవాలి అనే అంశాలపై సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం.

 

కేసీఆర్ తో భేటీ

 

అటు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వలసలపైనే చర్చలు జరిగినట్లు సమాచారం. పార్టీ ఉల్లంఘన చట్టంపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని, దేశవ్యాప్తంగా ఈ విషయంపై ఆందోళనలు చేసేలా..అవసరమైతే విపక్ష కూటమిని కలుపుకుని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ ఉల్లంఘన చట్టం కఠినంగా అమలుచేసేలా సుప్రీం కోర్టులో బలమైన వాదనలు వినిపించి, ఢిల్లీలో రాష్ట్రపతి ముర్మును కలిసి పార్టీ ఉల్లంఘన చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అగ్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.

 

1985 నుంచి అమలులోకి వచ్చిన చట్టం

 

1967 లోనే పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి నాడు వైబీ చవాన్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పడింది. అయితే క్రమంగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఆవశ్యకతను గుర్తించిన పలు రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని పట్టుబట్టడంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టారు. 1984 లో అప్పటి ప్రధాని రాహుల్ గాంధీ ప్రజాభిప్రాయాన్ని శిరసావహించి పార్టమెంట్ లో పార్టీ నిరోధక బిల్లును ప్రతిపాదించి, రాష్ట్రపతి ద్వారా ఈ బిల్లును అమోదింపజేశారు. 1985 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల చట్టం ఏర్పడింది. అయితే 2003 లోనూ సవరణ జరిగింది. ఎన్ని సవరణలు చేసినా కఠినంగా చర్యలు లేకపోవడంతో వలసల సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఒక్కోసారి అధికార పార్టీ కూడా చిక్కుల్లో పడాల్సి వస్తోంది.

 

జాతీయ స్థాయిలో ఉద్యమం

 

ఇక బీఫామ్ పై గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో తమకు జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇందు కోసమే కీలక నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిసి దీనిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం చేసిందే కాంగ్రెస్. అలాంటిది ఇప్పుడు వలసలను ఎలా ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై ఫైర్ అవుతూ వస్తున్నారు. ఇదెలా ఉండగా ఢిల్లీ పర్యటనలో బావాబావమరుదులు ఇద్దరూ బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం గురించి ప్రయత్నాలు జరిపినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే వలసలు, కేసులతో పీకల్లోతు మునిగిపోయిన పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో బీజేపీలో చేరడమే శ్రేయస్కరమని కొందరు కేసీఆర్ కు సూచిస్తున్నారు. పైగా లిక్కర్ కేసు నుంచి కవిత బయటకు రావాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందేనని కొందరు భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావుల ఢిల్లీ పర్యటన వెనుక ఇంత కథ నడిచిందా అని రాజకీయ పండితులు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *