కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కడపలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేసిందని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సామాన్యులు, మహిళలపై వంచన
ఓట్ల కోసం ప్రజలను వాడుకుని, గెలిచాక విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. కేవలం లోకేష్కు మంత్రి పదవి ఇచ్చుకోవడానికే ఈ ప్రభుత్వం పరిమితమైందని ఎద్దేవా చేశారు. నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి కోటిన్నర మంది మహిళలను ఘోరంగా మోసం చేశారని, ఆడవారిని మోసం చేసి బాగుపడినట్లు చరిత్రలో లేదని హెచ్చరించారు. అలాగే ఏటా ఇస్తామన్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఏమైందని ప్రశ్నించారు.
రైతులకు, నిరుద్యోగులకు ద్రోహం
నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోశారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన రూ. 26 వేలలో భారీగా కోతలు పెట్టారని ఆరోపించారు. మంచి చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక అన్నదాతల నోట్లో మట్టి కొట్టడంతో రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదన్నారు.
ఆరోగ్యం, విద్య రంగాల ధ్వంసం
పేదవాడికి అండగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీని కాస్తా ‘అనారోగ్య శ్రీ’గా మార్చేశారని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. హాస్పిటళ్లకు ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్లో పెట్టి ఉచిత చికిత్సలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందజేయకుండా వారి భవిష్యత్తును, జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే హామీలన్నీ అమలు చేసినట్లు ప్రజల్లోకి నేరుగా వెళ్దామా అంటూ ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.