మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి… క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ..!

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర నిరసన సెగ తగిలింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో శనివారం ఆయనపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో, ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి తనను తాను కాపాడుకోవాల్సి వచ్చింది.

 

అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధితుడైన ఓ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనార్‌పూర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో కమల్ గాజీ వద్ద కొంతమంది మహిళలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం సోనార్‌పూర్ చేరుకోగానే వందలాది మంది స్థానికులు, మహిళలు ఆయన్ని చుట్టుముట్టి “దొంగ” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

ఈ క్రమంలో, అభిషేక్ తన కారు దిగి, ఓ స్థానిక టీఎంసీ కార్యకర్త బైక్‌పై గమ్యస్థానానికి చేరేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు మరింత ఆగ్రహంతో ఆయనపైకి దూసుకొచ్చారు. కొందరు మహిళలు ఆయనపై చేయి చేసుకోగా, మరికొందరు చొక్కా చించివేశారు. ఆయనపైకి కోడిగుడ్లు విసరడంతో, వెంటనే ఆయన తలకి క్రికెట్ హెల్మెట్ పెట్టుకున్నారు. కొందరు రాళ్లు విసిరినప్పటికీ అవి ఆయనకు తగల్లేదు.

 

ఈ ఘటనపై అభిషేక్ తీవ్రంగా స్పందించారు. “ఇది బీజేపీ గూండాల పనే. నా తల హెల్మెట్ వల్ల సురక్షితంగా ఉంది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందా? నేను దాడికి గురవుతున్నప్పుడు పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తా, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తా” అని ఆయన అన్నారు. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్ బెనర్జీ బయట కనిపించడం ఇదే తొలిసారి. కాగా, శనివారం మధ్యాహ్నం సీఐడీ అధికారులు ఆయనకు విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *