సినిమా స్టోరీని తలపించేలా ఒక వింత దొంగతనం ఉదంతం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా దొంగలు ఇంట్లోకి చొరబడి దొరికిన కాడికి దోచుకుని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పారిపోవాలని చూస్తారు. కానీ, ఈ విచిత్ర దొంగ మాత్రం అలా చేయలేదు. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడిన సదరు కిలాడీ దొంగ, విలువైన వస్తువులను బ్యాగులో సర్దుకున్నాక.. హాయిగా వంటగదిలోకి వెళ్లాడు. నిమ్మళంగా స్టవ్ వెలిగించి, నచ్చిన వంటకం వండుకుని కడుపునిండా తిని అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.
అంతటితో ఆగకుండా ఆ దొంగ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెళ్లే ముందు యజమాని ఇంట్లోని ఒక పేపర్ ముక్కపై పోలీసులకు, ఇంటి ఓనర్కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ నోట్ రాసి పెట్టాడు. “నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు.. దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం” అంటూ రాసి, దాని కింద ఒక స్మైలీ బొమ్మను కూడా గీశాడు. ఉదయం ఇంటికి వచ్చిన యజమానులు తాళాలు పగలగొట్టి ఉండటం, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అక్కడ దొంగ రాసిన లేఖను చూసి ముక్కున వేలేసుకున్నారు. దొంగతనం చేయడమే కాకుండా, తమకే సవాల్ విసరడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలను సేకరించి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఈ వింత దొంగ చేసిన పనికి స్థానికులు నవ్వుకోవాలో, భయపడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.