పిడుగుపాటు నుండి రక్షించే ‘30-30 సూత్రం’

ఆకాశంలో మెరుపు కనిపించినప్పటి నుండి ఉరుము శబ్దం వినపడటానికి మధ్య సమయాన్ని లెక్కించడం ఈ సూత్రంలో మొదటి భాగం. మెరుపు చూసిన తర్వాత 30 సెకన్ల లోపు మీకు ఉరుము శబ్దం వినిపిస్తే, పిడుగు పడే ప్రమాదం చాలా దగ్గరలో ఉందని అర్థం. అలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షితమైన పక్కా భవనం లేదా మూసి ఉన్న వాహనంలోకి వెళ్ళిపోవాలి. బయట తెరిచిన ప్రదేశాల్లో ఉండటం అస్సలు సురక్షితం కాదు.

ఈ సూత్రంలో రెండో భాగం ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని నిర్ధారించుకోవడం. చివరిగా ఉరుము శబ్దం వినబడిన తర్వాత లేదా మెరుపు కనిపించిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు సురక్షిత ప్రాంతంలోనే వేచి ఉండాలి. వర్షం తగ్గినట్లు అనిపించినా, ఆకాశం కొద్దిగా క్లియర్ అయినట్లు అనిపించినా కూడా అరగంట గడిచేవరకు బయటకు రాకూడదు. ఎందుకంటే తుఫాను మేఘాలు దూరంగా వెళ్తున్నప్పుడు కూడా పిడుగులు పడే అవకాశం ఉంటుంది.

పిడుగుల బారిన పడకుండా ఉండటానికి నిపుణులు మరికొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు పొడవైన చెట్ల కింద నిలబడటం, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండటం, చెరువులు లేదా బావుల వంటి నీటి వనరుల సమీపంలో ఉండటం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ ఎలాంటి ఆశ్రయం లేని మైదానంలో చిక్కుకుపోతే, కాళ్ళు రెండూ దగ్గరగా పెట్టుకుని, తల వంచి మోకాళ్ళపై చేతులు పెట్టి నేలపై ముడుచుకు కూర్చోవాలే తప్ప, నేలపై పడుకోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *