పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేలా ఒక అవగాహన ఒప్పందం (MOU) దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా శాంతి చర్చలపై ఆశలు చిగురించాయి. పాకిస్తాన్, ఒమన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో తెరపైకి వచ్చిన ఈ తాజా ప్రతిపాదనలు సఫలమైతే, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న భీకర దాడులకు బ్రేక్ పడటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడిన భారీ భారం తొలిగిపోయే అవకాశం ఉంది.
ఈ తాజా ఒప్పందం ప్రకారం ప్రాథమికంగా 60 రోజుల పాటు ఇరుపక్షాలు కాల్పుల విరమణను పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య జలమార్గం ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) నుండి ఇరాన్ తన మైన్లను తొలగించి, నౌకల రాకపోకలను ఉచితంగా అనుమతించడానికి అంగీకరించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ రేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను సడలించి, విదేశాల్లో స్తంభించిపోయిన దాదాపు 25 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను అన్ఫ్రీజ్ చేసేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అయితే, ఈ శాంతి చర్చలు పూర్తి స్థాయిలో సఫలమవుతాయా లేదా అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ 60 రోజుల కాల్పుల విరమణ సమయంలోనే ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై ఇరు దేశాలు ప్రధాన చర్చలు జరపాల్సి ఉంది. తాము అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ మౌఖికంగా హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, తమ యురేనియం నిల్వలను పూర్తిగా అప్పగించేందుకు ఇరాన్ వెనుకాడుతోంది. అటు అమెరికాలోని కొందరు హార్డ్లైనర్లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండగా, ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, దశాబ్దాల నాటి వైరాన్ని మరిచి ఈ రెండు దేశాలు శాంతి వైపు అడుగులు వేస్తాయా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.