దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 చొప్పున భారీగా పెరగడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి భిన్నంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ రూ. 3 పెంపు అనేది చాలా అత్యల్పమని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది ఒక అత్యవసరమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సమర్థించారు.
అయితే, కేవలం ఇంధన ధరల పెంపుతోనే సరిపెట్టకుండా ప్రధాని నరేంద్ర మోదీ మరికొన్ని కీలక రంగాలపై కూడా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవుతున్న తరుణంలో ముడిచమురు, బంగారం, వంటనూనెలు, ఎరువుల వంటి వాటి దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా సుమారు 250 బిలియన్ డాలర్ల దిగుమతి భారాన్ని తగ్గించుకోవచ్చని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ప్రధానికి సూచించారు.
భవిష్యత్తులో ఇంధన సంక్షోభాన్ని శాశ్వతంగా అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను భారీగా విస్తరించాలని, అలాగే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా రవాణా వ్యవస్థను (Public Transport) మరింత బలోపేతం చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన ఆధారపడటాన్ని తగ్గించే ఇలాంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక నిర్ణయాలపై మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.