బీహార్లోని జేహనాబాద్లో ఓ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో జరిగిన ఐదేళ్ల బాలుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాఠశాల క్యాంటీన్లో పనిచేసే గార్డే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. బాలుడిపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత గొంతు కోసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
హత్యకు ఉపయోగించిన పదునైన బ్లేడును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడు ముఖేష్ అలియాస్ సుదామా (46)ను అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ కేసులో హాస్టల్ నిర్వాహకుడు తరుణ్ కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖేష్ను చాలా ఏళ్ల క్రితమే భార్య వదిలి వెళ్లిపోయింది. దీంతో హాస్టల్లోని పిల్లలు అతడిని ‘నపుంసకుడు’ అని ఎగతాళి చేసేవారని, ఈ కారణంగా అతను తీవ్ర మనోవేదనతో ఉన్నాడని ఎస్పీ అప్రజిత్ లోహన్ చెప్పారు. అంతేగాక హాస్టల్ నిర్వాహకుడితో కూడా ముఖేష్కు గొడవలున్నాయని, హాస్టల్ పేరు చెడగొట్టి మూసివేయిస్తానని బెదిరించినట్లు ఎస్పీ తెలిపారు.
గత ఆదివారం రాత్రి నిందితుడు బాలుడిని తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేసి విషయం బయటపెడతాడనే భయంతో గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని హాస్టల్ మెట్లపై పడేశాడు.
మరుసటి రోజు ఉదయం, హాస్టల్ నిర్వాహకుడు బాబు తండ్రికి ఫోన్ చేసి, బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. అక్కడికి వెళ్లిన తండ్రి, తన కొడుకు గొంతు కోసి, జననాంగాలు ఛిద్రమై ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో లభించిన కీలక ఆధారాలతో ముఖేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేరాన్ని అంగీకరించాడని ఎస్పీ లోహన్ తెలిపారు. నేరం జరిగినప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నట్లు నిందితుడు చెప్పాడని ఆయన పేర్కొన్నారు.