అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను రేవంత్ రెడ్డి అరాచకంగా గుంజుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ చరిత్రలో ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని అన్నారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్, కౌన్సిలర్లను, సర్పంచ్లను శనివారం సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎదుర్కొని బలంగా నిలబడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా కేటీఆర్ అభినందించారు.
అధికారం శాశ్వతమా..
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ప్రశాంత్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందన్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడని, కానీ ఇదే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని, పదవిని చూసుకొని అహంకారంతో ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు రెండు నెలల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
ఫోర్త్ సిటీ పేరుతో మోసం
మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందన్నారు. అయితే చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ పేరుతో భూముల దందా చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతన్నలకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని, ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ, బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందన్నారు. ఆనాడు ఫార్మా సిటీ భూముల్లో అప్పటి సిఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) సహా మిగిలిన మేధావులు పాదయాత్ర చేసి మాకు ఓటు వేస్తే మీ భూములు మీకు తిరిగి అప్పజెపుతాం అని హామీ ఇచ్చారని అన్నారు.
సిటిలో దోమలు..
రెండున్నర సంవత్సరాల తర్వాత మరో 16,000 ఎకరాల అదనపు భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారన్నారు. కేవలం తన అనుచరులకు, తన కుటుంబ సభ్యులు సోదరులకి భూములు కట్టబెట్టడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఫ్యూచరే లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. గత ప్రభుత్వం కోహెడలో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కడతామని అంటే, వాటిని మళ్ళీ ఇప్పుడు రాచకొండ గుట్టలకో, రామోజీ ఫిలిం సిటీ అవతలకో పోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈ 178 ఎకరాలను అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
భూముల దందా..
ఒకప్పుడు నిషేధిత భూముల జాబితాను తగ్గించి భూమి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు ఉన్న నిషేధిత భూముల సంఖ్యను కోటి ఎకరాలకు పెంచి, అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భూముల దందా చేస్తోందని విమర్శించారు. ఈ నిషేధిత జాబితాను అడ్డు పెట్టుకొని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్లు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతూ భూముల దందా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్నారు. ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి, అరాచకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. హోటళ్ల నుంచి, బార్ల నుంచి, క్రషర్ల నుంచి ప్రతి ఒక్కరి నుంచి అడ్డగోలుగా నెలకి ఇంత చొప్పున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న అరాచకాలను కేటీఆర్ ప్రస్తావించారు.
త్వరలోనే మంచి రోజులు..
ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని పార్టీ వెంటనే నిలబడి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న ప్రతి ఒక్క నాయకుడికి, మున్సిపల్ కౌన్సిలర్ కి పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాటు మన పార్టీకి ఉన్న కష్టకాలం పోయిందని, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. రానున్న గవర్నమెంట్లో వారందరినీ గుర్తుంచుకొని మరీ తగిన విధంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల కోసం పని చేయాలని కేటీఆర్ హెచ్చరించారు.