వాలంటీర్ల వ్యవస్థ అనగానే ముందుగా వైసీపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే గడిచిన ఐదేళ్లు వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపించారు. పార్టీ-కార్యకర్తలకు సంబంధాలు తెగిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాలని ఆలోచన చేస్తోంది.
తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ రానుంది. భూసారాన్ని కాపాడేందుకు భూసార ఆరోగ్య వాలంటీర్లును నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 వేల మంది నియమిస్తామని తెలియజేశారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్లో ఇక్రిశాట్- తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా వాలంటీర్లకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్రిశాట్లో తొలివిడత సాయిల్ వాలంటీర్లకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నది మొదట ప్రయార్టీగా చెప్పారు.
గ్రామానికి ముగ్గురు, ఏకంగా 30 వేల మందికి అవకాశం
అదే సమయంలో సేంద్రియ ఎరువులను వాడటాన్ని పెంచాలని సూచన చేశారు. అందుకోసం వాలంటీర్లను నియమిస్తున్నట్లు వివరించారు. భూమిలో రసాయనాలు లేకుండా ఉంటే పండించిన పంటలో పౌష్టికాహారం ఉంటుందన్నారు. రైతులు.. జీలుగ, పిల్లి పెసర, పచ్చి రొట్ట విత్తనాల ద్వారా భూ సారాన్ని పెంచాలన్నారు.
పంట కోసిన తర్వాత వాటి అవశేషాలు పంట పొలంలో తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలన్నారు. రాష్ట్రంలో భూసార ఆరోగ్య పరిరక్షణ ఓ ఉద్యమంలా చేపట్టేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను కేటాయించనున్నారు.
సాయిల్ హెల్త్ వాలంటీర్లు.. తమ పరిధిలో రైతులకు భూసారం ఎలా కాపాడాలి? పంటకు భూమిని ఎలా తయారు చేయాలి? అనే దానిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను తీసుకువచ్చే నైపుణ్యాలను సైతం నేర్పించనున్నారు.