తమిళనాడులో సంచలనం సృష్టించిన సాథాన్కుళం లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన ఘటనలో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్రూరత్వానికి పాల్పడిన పోలీసులపై న్యాయస్థానం అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సహా మొత్తం 9 మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. రక్షించాల్సిన పోలీసులే నిరాయుధులైన తండ్రీకొడుకులను హింసించి చంపడం అరుదైన వాటిలో అరుదైన కేసుగా కోర్టు పరిగణించింది.బఈ కేసు దర్యాప్తును తొలుత స్థానిక పోలీసులు చేసినప్పటికీ, ప్రజల ఒత్తిడి మేరకు సిబిఐ (CBI)కి అప్పగించారు. సిబిఐ సమర్పించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాల వల్లే దోషులకు శిక్ష పడింది.
అసలు ఏం జరిగింది?
2020లో కరోనా లాక్డౌన్ సమయంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు షాపు తెరిచి ఉంచారనే చిన్న కారణంతో పోలీసులు జయరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగినందుకు కుమారుడు బెన్నిక్స్ను కూడా స్టేషన్కు తరలించారు. ఆ రాత్రంతా పోలీసులు వారిద్దరినీ అమానుషంగా హింసించారు. లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. తీవ్ర గాయాల పాలైన బెన్నిక్స్ జూన్ 22న ఆసుపత్రిలో మరణించగా, కొన్ని గంటల వ్యవధిలోనే జూన్ 23 తెల్లవారుజామున తండ్రి జయరాజ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరి శరీరాలపై వందకు పైగా గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టం రిపోర్టులో తేలింది.
ఈ తీర్పు పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని, కస్టోడియల్ హింసకు పాల్పడే వారికి ఇది ఒక బలమైన హెచ్చరిక అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధితుల కుటుంబానికి ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు