జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల స్వీకరణ అలాగే పరిశీలన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల మీడియాలో వస్తున్న వివిధ రకాల కథనాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఈ విషయంలో జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నిబంధనల ప్రకారం కార్డులు అందుతాయని భరోసా ఇచ్చారు.

 

రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను పరిశీలించేందుకు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియను పూర్తి చేస్తారు. అర్హత కలిగిన జర్నలిస్టుల జాబితాను ఖరారు చేసిన వెంటనే నూతన అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుంది. ఏప్రిల్ మాసం ముగిసేలోపు ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి కార్డులను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

 

జిల్లా స్థాయిలో కూడా అక్రిడిటేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీలు సమావేశం కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల దరఖాస్తులను నిశితంగా పరిశీలించి వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను అప్‌లోడ్ చేసుకోవాలని కోరారు.

 

అక్రిడిటేషన్ల జారీలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పెషల్ కమిషనర్ వివరించారు. దరఖాస్తుదారులు తమ పత్రాలను సరైన ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో సమర్పించడం ద్వారా ప్రక్రియ సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *