నాగర్కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక , ప్రముఖ నాయకుడు ప్రవీణ్ తమ అనుచరులతో కలిసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగర్కర్నూల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అచంచలమైన మద్దతు, వివిధ పార్టీల నుండి చేరుతున్న నాయకుల విశ్వాసమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన విజయాన్ని అందించారని, అదే స్ఫూర్తితో పార్టీ మరింత ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోవడం ఖాయమని, ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు ఎవరూ లేరని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి సమాజ మార్పుకు కృషి చేయాలని రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ చేరికతో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.