ఏపీకి బీఆర్ఎస్ లీడర్లు..? ఎందుకంటే..?

వలసల్ని ఆపడం కోసం కేసీఆర్‌ కొత్త స్కెచ్ గీస్తున్నారా? పొరుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేయడానికి పార్టీ నేతల్ని సమాయత్తం చేస్తున్నారా? అటు తమిళనాడుతో ఏపీలో కూడా గులాబీ బృందాలు పర్యటించనున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తుంది. తాజాగా సెప్టెంబరులో ఆయా పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి తనతో పాటు పార్టీ నేతలు స్టీడీ టూర్‌కి వెళ్లనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అసలు గులాబీ బాస్ లెక్కలేంటి?

నేర్చుకుంటారట.

 

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది గులాబీ పార్టీ.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారాక పదేళ్లు అధికారంలో కూడా కొనసాగింది. అసలు ఆ పార్టీ పుట్టి ఇప్పటికి 24 ఏళ్లు అవుతుంది. 2001 నుంచి ఎన్నెన్నో ఉద్యమ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు కేసీఆర్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ ఒన్ మాన్ షోతోనే కారు మొన్నమొన్నటి వరకు పరుగులెట్టింది.

 

అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదారి తాము చూసుకుంటున్నారు. అసలు ఉండేవారెవరో ఊడేవారెవరో అర్థం కాకుండా తయారవుతోంది. ఓటమి తర్వాత వరుస పరిణామాలతో కేసీఆర్ తన ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. వాస్తవానికి రెండు సార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ వలస ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో బలం పెంచుకుంది.

 

మొదటి సారి బొటాబొటీ మెజార్టీతో గెలిచిన కేసీఆర్.. అప్పట్లో గెలిచిన వైసీపీ, బీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం పేరుతో కలిపేసుకుని వారికే తర్వాత టికెట్లు ఇస్తూ వచ్చారు. రెండో సారి గెలిచినప్పడు కూడా అదే సీన్ కనిపించింది. 2018లో రెండో సారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించో, బామాలో కారెక్కించుకున్నారు. తర్వాత కూడా సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు అంటూ వలస నేతలకే టికెట్లిచ్చి ఓటమి మూటగట్టుకున్నారు.

 

సంస్థాగతంగా చూస్తే తెలంగాణ సెంటిమెంటుతో 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మందే నిజమైన గులాబీ నేతలని చెప్పాలి. అప్పట్లో వారిలో చాలా మంది ఎన్నికలకు కొత్తే ఉద్యమ సెంటిమెంట్ ఆ పార్టీకి కలిసి వచ్చింది. 2018లోనూ అదే సెంటిమెంట్ ప్రయోగించి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అంతేకాని పార్టీ సంస్థాగత నిర్మాణం, కేడర్‌ని సమర్ధంగా నడిపించే నాయకత్వం ఆ పార్టీకి ముందు నుంచీ లేదనే చెప్పాలి. ఆ ప్రభావం ఏ సెంటిమెంటూ పనిచేయని 2023 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

 

ఆ వాస్తవాన్ని ఇప్పటికి గ్రహించారో ఏమో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు గులాబీ నేతలు.. పక్క రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నిర్మాణంపై స్టడీ చేయడానికి వెళ్లి వస్తామంటున్నారు. సెప్టెంబరులో పార్టీ సీనియర్ నేతలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో తిరిగి వస్తానంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వచ్చాక పార్టీ బలోపేతానికి అవసరమైతే కొత్త కమిటీలు వేసుకుంటామని వెల్లడించారు.

 

పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా తమ అధ్యయనం ఉంటుందంటున్నారు బీఆర్ఎస్ చిన్నబాస్.. మంచి ఎక్కడున్నా నేర్చకుంటామంటున్న ఆయన టీడీపీతో పాటు వైసీపీ నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారంట.

 

ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలతో బీఆర్ఎస్ కేడర్ చెట్టకొకరు పుట్టకొకరు అన్నట్లు చెదిరిపోతోంది. మరిలాంటి పరిస్థితుల్లో 24 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన గులాబీ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం అధ్యయనం చేస్తుందో? పార్టీ పరంగా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *