సింధు జలాల వివాదంలో పాక్‌కు భారీ ఎదురుదెబ్బ.. మధ్యవర్తిత్వ ఖర్చుల భారం మొత్తం ఇస్లామాబాద్‌పైనే

సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల వివాదంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య, ఆర్థిక ఎదురుదెబ్బ తగిలింది. హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA)లో పాకిస్థాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కొనసాగుతున్న మధ్యవర్తిత్వ విచారణ ఖర్చుల భారం ప్రస్తుతం పూర్తిగా పాకిస్థాన్‌పైనే పడింది.

ఈ వ్యవహారంలో భారత్ మధ్యవర్తిత్వ ప్రక్రియను బహిష్కరించడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో, భారత్ చెల్లించాల్సిన వాటా నిధులను కూడా పాకిస్థానే భరించాల్సి వస్తోందని సమాచారం.

దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌పై అదనపు ఆర్థిక భారం పడింది. సింధు జలాల వివాదంలో ఈ పరిణామం ఇస్లామాబాద్‌కు మరో కీలక సవాలుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.