హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా సైదాబాద్, పరిసర ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ గుడ్న్యూస్ చెప్పింది. గత ఆరేళ్లుగా వివిధ అడ్డంకులతో కొనసాగుతూ వచ్చిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉంది.
బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో దీనిని ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ముహూర్తం ఖరారు చేసింది. రేపు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చేతుల మీదుగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏళ్ల తరబడి నిర్మాణ పనులు కొనసాగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సైదాబాద్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బ్రిడ్జి ప్రారంభంతో స్థానికంగా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.