ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూడాల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 వేల మంది జూనియర్ డాక్టర్లు ఆందోళనలో ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారని జగన్ ప్రశ్నించారు. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్ స్టైపెండ్ పెంపు కాగా, ప్రభుత్వం ఇటీవల 5 శాతం పెంపు ప్రతిపాదనను ప్రకటించింది. అయితే ఇది తమ డిమాండ్లకు, ద్రవ్యోల్బణానికి సరిపోదని AP జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తిరస్కరించింది. ప్రస్తుతం వారు 20 శాతం బేస్ ఫిట్మెంట్ సవరణను డిమాండ్ చేస్తున్నారు.
జూడాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, సంతృప్తికరమైన నిర్ణయం వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. స్టైపెండ్ సవరణతో పాటు ఇతర వైద్య విద్య, సీనియర్ రెసిడెంట్ల సమస్యలను కూడా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.