గ్లోబల్ వార్మింగ్ ప్రభావం.. ఆఫ్రికాలో ఒంటెలకు పెరుగుతున్న ముప్పు

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఎడారి ఓడలుగా పేరొందిన ఒంటెలు కూడా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని పర్యావరణ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ జంతువులు, ఆఫ్రికాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన కరువుల కారణంగా మరణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఉత్తర ఆఫ్రికా మరియు ఆఫ్రికా కొమ్ము ప్రాంతం ప్రపంచంలోని మొత్తం ఒంటెల జనాభాలో సుమారు 80 శాతానికి నిలయంగా ఉన్నాయి. అయితే సోమాలియాలోని సూల్ ప్రాంతంలో కరువు, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 73 శాతం ఒంటెలు మరణించినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే కేన్యాలోని మార్సాబిట్ కౌంటీలో గత రెండేళ్లలో ఉష్ణోగ్రతల ఒత్తిడి వల్ల ఒంటెల మరణాలు 15 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు సమాచారం.

ఉష్ణోగ్రతలు 41°C నుండి 45°C దాటినప్పుడు ఒంటెల తెల్ల రక్తకణాలు దెబ్బతిని, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని ఆల్జీరియాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతం ప్రతి దశాబ్దానికి సగటున 0.43°C చొప్పున వేడెక్కుతోంది. 2024 నుంచి పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50°C దాటుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.