దులీప్ ట్రోఫీ 2026-27లో ఈస్ట్ జోన్ ఛాంపియన్గా నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా టోర్నీ మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బ్యాటింగ్తో పాటు జట్టు అతడిపై ఉంచిన నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. టోర్నీ అనంతరం ఇషాన్, వైభవ్ మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించిన వైభవ్.. సెమీఫైనల్లో ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడిన సమయంలో తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా అతడికి వచ్చింది. వైభవ్ తీసుకున్న కొన్ని రివ్యూలు సరైనవిగా తేలడంతో అతడి క్రికెట్ పరిజ్ఞానంపై ప్రశంసలు వచ్చాయి. ఫైనల్లో ఇషాన్ కెప్టెన్గా మైదానంలో ఉన్నప్పటికీ.. రివ్యూ తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాల్లో వైభవ్ కీలకంగా వ్యవహరించాడు.
ఫైనల్లో ఓ సందర్భంలో వైభవ్.. ఇషాన్ కిషన్ను రివ్యూ తీసుకోవాలని ఒప్పించాడు. ఆ నిర్ణయం సరైనదిగా తేలడంతో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. టోర్నీ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వైభవ్ క్రికెట్ పరిజ్ఞానాన్ని ప్రశంసిస్తున్నారు. చిన్న వయసులోనే మైదానంలో పరిస్థితులను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఆసక్తికరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.