Uday Krishna Reddy: ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో కీలక ఆధారాలు మాయం.. ఐఫోన్ ఎక్కడ?

సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. కేసు దర్యాప్తులో కీలకంగా భావిస్తున్న సూసైడ్ నోట్‌తో పాటు ఇతర వివరాలు ఉన్నట్లు చెబుతున్న ఆయన ఐఫోన్ ప్రస్తుతం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కస్టడీ విచారణ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూసైడ్ నోట్‌పై ప్రశ్నించినట్లు సమాచారం. తాను మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో లేఖ రాశానని, ప్రస్తుతం ఆ లేఖ ఎక్కడ ఉందో తనకు తెలియదని ఉదయ్‌కృష్ణారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీసులను తప్పుదోవ పట్టించారా? మరో సెక్షన్ నమోదు

విచారణలో తాను మద్యం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పినప్పటికీ, దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో మరో అదనపు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కస్టడీ గడువు ముగియడంతో ఉదయ్‌కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కీలక ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్న ఐఫోన్‌ను అప్పగించకపోవడం, దర్యాప్తునకు సహకరించకపోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్, సూసైడ్ నోట్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తే కేసు దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.