ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఆదాయం పెంపే లక్ష్యంగా కీలక ఆదేశాలు..!

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేవలం ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయంతోనే రెవెన్యూ మిగులు సాధిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ఖనిజ సంపదకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ ద్వారా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించి, ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలి” అని అన్నారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యూమినా వంటి ఖనిజాలకు ఇక్కడే విలువ జోడింపు ప్రక్రియలు జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

 

అరుదైన ఖనిజాలపై ప్రత్యేక దృష్టి

 

ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్, అణు ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాల్లో కీలకంగా ఉపయోగపడే అరుదైన భూ ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్)పై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాల కోసం ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ వంటి అత్యంత విలువైన ఖనిజాల నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలన్నారు.

 

అలాగే, రాష్ట్రంలోని జొన్నగిరి, చిత్తూరు జిల్లా చిగురుగుంట ప్రాంతాల్లో ఉన్న బంగారం నిల్వలపై మరింత లోతుగా అధ్యయనం చేసి, ఇతర బ్లాకుల్లోనూ అన్వేషణ జరపాలని గనుల శాఖకు సూచించారు. రాష్ట్రంలో మొత్తం 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్, ఇతర విలువైన ఖనిజాలను గుర్తించినట్లు అధికారులు ఈ సమావేశంలో సీఎంకు వివరించారు.

 

టెక్నాలజీతో ఇసుక పర్యవేక్షణ

 

ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఇసుక విధానంలో పారదర్శకతకు, అక్రమాలకు తావులేకుండా చూడటానికి టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. “ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల ఆదాయాన్ని వదులుకుని ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఇది దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే” అని స్పష్టం చేశారు.

 

ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, శాటిలైట్ చిత్రాల ద్వారా నిరంతర నిఘా, ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం సమకూరేలా చూడాలని అధికారులకు సూచించారు.

 

ఈ సమీక్షా సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.