జులై 2న తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. జులై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో జరిగే ఈ 34వ మంత్రిమండలి భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

 

కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో సచివాలయంలో పరిపాలనా పరమైన హడావుడి మొదలైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించిన అజెండా అంశాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ ప్రతిపాదనలను తెలుగు అనువాదంతో సహా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఏ శాఖలోనైనా ఎలాంటి అజెండా అంశాలు లేకపోతే.. ‘నిల్’ (NIL) రిపోర్టునైనా సరే నిర్ణీత సమయానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 

మరోవైపు, సమావేశం జరిగే సమయంలో ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా గట్టి చర్యలు చేపట్టింది. కేబినెట్ భేటీ ముగిసే వరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్యదర్శులందరూ కచ్చితంగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రొటోకాల్ డైరెక్టర్, హార్టికల్చర్ డైరెక్టర్, ట్రాన్స్‌లేషన్స్ డైరెక్టర్, TGTS యూనిట్ మేనేజర్లు సమావేశానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.