హైదరాబాద్లోని ఒక ప్రముఖ టైల్స్ షోరూమ్ యజమాని కూతురు, తన ఇంట్లో పనిచేసే మేనేజర్కు ఏకంగా కిలో బంగారాన్ని అప్పగించడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. మొదట ఇది ఏదో భారీ బహుమతి లేదా దాతృత్వం అని అందరూ భావించినప్పటికీ, పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు విని స్థానికులు విస్తుపోతున్నారు. నమ్మకస్తుడైన మేనేజర్ ఆ అమ్మాయిని మాటల్లో దింపి, మాయమాటలతో బురిడీ కొట్టించి ఈ బంగారాన్ని కాజేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏమిటంటే, సదరు మేనేజర్ ఆ అమ్మాయికి మాయా మంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో భయం పుట్టించాడని సమాచారం. మీ ఇంట్లో దోషం ఉందని, ఆ బంగారానికి ప్రత్యేక పూజలు చేయకపోతే కుటుంబానికి విపత్తు కలుగుతుందని నమ్మించి, ఆమెను తన వలలో వేసుకున్నాడు. ఆ భయంతోనే ఎవరికీ చెప్పకుండా ఆ యువతి ఇంట్లోని లాకర్ నుంచి కిలో బంగారాన్ని తీసి అతడికి అప్పగించింది. కొద్దిరోజుల తర్వాత ఇంట్లో బంగారం మాయమవ్వడం గమనించిన తండ్రి నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, పరారీలో ఉన్న మేనేజర్ను సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. నిందితుడు కేవలం బంగారం మాత్రమే కాకుండా, కొంత నగదును కూడా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, కూతురి అమాయకత్వాన్ని పెట్టుబడిగా మలచుకున్న ఈ మేనేజర్ లీలలు చూసి పోలీసులు సైతం అశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించి, రికవరీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.