‘కదలిరండి మనుషులైతే… కలసి రండి మమత ఉంటే’… ఇది ‘ఊరికి మొనగాడు’లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు ఆయన తన అభిమానులను అదే కోరుతున్నారు. ‘కరోనా’ మీద దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ‘ఎస్.పి.బి ఫ్యాన్స్ చారిటబుల్ ట్రస్ట్’కు విరాళాలు పంపమని కోరుతున్నారు. అయితే ఆయన ఇందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నారు. వంద రూపాయల నుంచి ఎన్ని రూపాయలైనా విరాళం ఇచ్చి ఒక పాట కోరుకుంటే ఆ అభిమాని కోరిక మేరకు ఆ పాటను పాడి ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల అభిమానులకు బాలు ఈ పిలుపు ఇచ్చారు. విరాళాలు ఇస్తున్న అభిమానుల కోసం ఆ మూడు భాషల పాటలను కూడా పాడి ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.