కవితకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ తరలింపు..!

ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతోపాటు గొంతు ఇన్ఫెక్షన్‌ సమస్యలతో ఆమె బాధపడ్డారు. దీంతో వెంటనే ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స అనంతరం ఆమెను తిరిగి తిహార జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె సుమారు వంద రోజులపాటు జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదు. కవిత అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ఇవాళ రాత్రి లేదా బుధవారం ఉదయం కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

 

గతంలోనే అనారోగ్య సమస్యలతో కవిత బాధపడ్డారు. ఈ సమస్యలను పేర్కొంటూ బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టుకు విన్నవించారు. కానీ, రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ తిరస్కరించింది. కొడుకు పరీక్ష కోసం మధ్యంతర బెయిల్ కోసం కూడా ఆమె దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. జైలులో నుంచి ఆమె కోర్టుకు రాసిన ఓ లేఖ సంచలనమైంది. తాను అమాయకురాలినని, ఈ కేసులో ఇరికించారని ఆమె పేర్కొన్నారు. ఏ ఆధారం లేకుండానే తనను జైలులో పెట్టారని ఆరోపించారు.

 

ఈడీ అధికారులు ఆమెను మార్చి నెలలో అరెస్టు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఆమెను విచారించారు. ఆ తర్వాత సీబీఐ కూడా ఆమెను తిహార్ జైలు నుంచే కస్టడీలోకి తీసుకుని ఈ కేసులో విచారించింది. బెయిల్ కోసం ఆమె అనేక ప్రయత్నాలు చేసినా ఈడీ, సీబీఐ మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వరాదని అభ్యంతరం తెలిపాయి. తొలుత ఈ కేసులో ఆమెను సాక్షిగా ప్రస్తావించిన దర్యాప్తు సంస్థలు ఆమె తర్వాత నిందితురాలిగా.. ఆ తర్వాత ఆమె కింగ్ పిన్ అని కూడా పలుమార్లు వ్యాఖ్యానించాయి.

 

తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్‌లు ఒకసారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిసి వచ్చారు. ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కవితను జైలులో కలిసి పరామర్శించి వచ్చారు. ఈ కేసులో నుంచి ఆమె తప్పకుండా బయటపడుతుందని, ధైర్యంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. వీరందరి కంటే ముందు కేటీఆర్ కూడా ఆమెను కలిశారు. బెయిల్ విచారణ సందర్భంగా కవిత కుటుంబ సభ్యులు ఆమెను కలిసి ధైర్యం చెప్పారు.

 

ఇటీవలే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తన బిడ్డ కవితను ఈ కేసులో నుంచి బయటికి తీసుకురావడానికి పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *