వైసీపీకి మరో బిగ్‌షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా..

కర్నూలు జిల్లాలో YCPకి బిగ్‌షాక్‌ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రోజే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించి వైసీపీకి షాకిచ్చారు. మంత్రి పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కర్నూల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్ చెప్పినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని, టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం ఆయన స్పష్టం చేశారు.

 

కాగా.. అధికార వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటి వరకూ 9 లిస్టులు ప్రకటించిన అధిష్ఠానం సిట్టింగులను కాదని.. వారిని మరో నియోజకవర్గాలకు మార్చింది. అధిష్టానం తీరుతో విసిగిన వారంతా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. కొంతకాలంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనాయకులతో పాటు ద్వితీయశ్రేణి నేతలంతా ముక్కుమ్మడి రాజీనామా చేస్తున్నారు.

 

కాగా.. గుమ్మనూరు జయరాం అనుచరులు ఆయన కాన్వాయ్‌లకు వైసీపీ స్టిక్కర్లు తొలగించి.. తెలుగుదేశం స్టిక్కర్లు అతికించారు. పార్టీలో చేరిన తర్వాత.. ఆలూరు టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి కోరినట్లు తెలుస్తోంది. ఆలూరులో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో… మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ అభ్యర్థి విరుపాక్షికి పోటీగా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని జయరాం కోరినట్లు సమాచారం. ఆలూరు సీటు ఇవ్వని పక్షంలో.. గుంతకల్లు సీటును కోరగా దానిపై అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

 

జయహో బీసీ కార్యక్రమానికి జయరాం హాజరుకానున్నారు. అక్కడే చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అసమ్మతి నేతలు… తెలుగుదేశం వైపు చూస్తున్నారు. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్నందున.. తనకే సీటు ఇవ్వాలని జయరాం కోరినా.. వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *