తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు..

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను నిర్మించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అమృత్ భారత్ స్టేషన్ల రీ డెవలప్ మెంట్ లో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.843.54 కోట్ల వ్యయంతో ఆధునీకరించనున్న ఈ స్టేషన్లకు ప్రధాని నరేంద్రమోదీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు సోమవారం దేశవ్యాప్తంగా 500లకు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మరో 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు భూమిపూజ నిర్వహిస్తారు.

 

అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ స్కీమ్ లో భాగంగా.. రైల్వే ప్రయాణికులకు స్టేషన్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకే ఈ ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 72 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడలతో పాటు.. నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను కేంద్రం గుర్తించింది. వీటి అభివృద్ధికి రూ.270 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆయా స్టేషన్లలో పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు మరో 34 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది.

 

ఏపీలో అనంతపురం, అనపర్తి, చీరాల, బాపట్ల, ఆదోని, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మంగళగిరి, మార్కాపురం, మంత్రాలయం, నడికుడి, నంద్యాల, నర్సారావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకోట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.610.30 కోట్లు ఖర్చు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *