గురువారం రాత్రి మేడారంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం జాతరలో ముఖ్యమైనదిగా ఘట్టం సమ్మక్క తల్లి గద్దెనెక్కడం. చిలకలగుట్ట నుంచి జన నీరాజనాల మధ్య డప్పు చప్పుళ్ల నడుమ సమ్మక్క తల్లి గద్దె మీదకు ప్రవేశించింది.
సమ్మక్క తల్లి రాకకు గుర్తుగా ములుగు ఎస్పీ శబరీష్ ఎకే 47తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ మహాఘట్టం గురువారం రాత్రి 9: 28 గంటలకు ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా మేడారంలో మూడు నిమిషాల పాటు కరెంట్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా నేడు అమ్మవార్లను దర్శించుకోవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం రానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో గత జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో మేడారానికి తరలిరావడం ఇదే తొలిసారి.
ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న గద్దెనెక్కారు. సమ్మక్క కూడా గద్దెనెక్కడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెండురోజుల్లో 50 లక్షల మంది మేడారానికి రాగా మరో 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రేపు(శనివారం) అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది.