హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారిని మోసం చేసిన క్యాబ్ డ్రైవర్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ జిల్లాకు చెందిన పిల్లి వెంకటరమణ 2012లో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగానికి చేరాడు. మాజీ ఐఏఎస్ దంపతులు ఒక్కరే నగరంలో ఉంటుండగా, వారి సంతానం విదేశాల్లో ఉంటున్నారు. నమ్మకంతో పని చేసిన వెంకటరమణను మాజీ ఐఏఎస్ దంపతులు పూర్తిగా నమ్మారు. బ్యాంకులకు వెళ్తున్న సమయంలో అతన్ని వెంట తీసుకువెళ్లే వారు. వీరి ఇంట్లో పని చేయడంతో పాటు వెంకటరమణ ఊబర్లో కూడా కారు డ్రైవర్గా పని చేశాడు. కొద్ది రోజుల తర్వాత బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఇన్నోవాతోపాటు మరో రెండు కార్లను కొనుగోలు చేసి ట్రావెల్స్ వ్యాపారం నిర్వహించాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో మాజీ ఐఏఎస్ ఖాతా నుంచి నగదు తీసుకోవాలని ప్లాన్ వేశాడు. మాజీ ఐఏఎస్ అధికారి ఎస్బీఐకు చెందిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సేకరించి ఎస్ఆర్నగర్ ప్రాంతంలోని ఓ మనీ ట్రాన్స్ఫర్ కేంద్రంలో 2018 ఆగస్టు నుంచి రూ.63 లక్షలను డ్రా చేశాడు. ఈ డబ్బుతో రెండు కార్లు కొనుగోలు చేయడంతోపాటు అప్పులు తీర్చుకున్నాడు. ఇటీవల బ్యాంక్కు వెళ్లిన మాజీ ఐఏఎస్ అధికారి తన ఖాతా నుంచి నగదు డ్రా అయ్యిందని గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు వెంకటరమణను అరెస్టు చేసి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.