వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, శుక్రవారం రాత్రి ఏడో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ను పార్టీ సమన్వయ కర్తలుగా అధిష్టానం నియమించింది.
ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించగా.. తాజాగా, ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించింది. పర్చూరు ఇంఛార్జీగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇంఛార్జ్మహీధర్రెడ్డిని తప్పించింది. కాగా, ఇప్పటి వరకు ఆరు విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్సభ సీట్లకు ఇంఛార్జులను నియమించిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పటివరకు ఆరు జాబితాలు విడుదల చేసింది వైసీపీ అగ్రనాయకత్వం.. అనేక మార్పులు చేర్పులు చేసింది. పలువురు సిట్టింగ్లకు టికెట్ల నిరాకరించారు జగన్. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణ మోహన్ ఉన్నారు.
ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ ని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఇవాళ(ఫిబ్రవరి 16) మధ్యాహ్నం సీఎం జగన్ ను కలిసి పర్చూరు గురించి చర్చించారు. ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇంచార్జిగా నియమించడం గమనార్హం.