తిరుపతి జూ పార్కులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిని చంపి తల భాగాన్ని పూర్తిగా తినేసింది సింహం. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై జూ అధికారులను ఆరాతీస్తున్నారు.
కాగా, తిరుపతి జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ దిగేందుకు లయన్ ఎన్క్లోజర్ లోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే, సింహం అరుపులతో భయపడి ఆ వ్యక్తి చెట్టు ఎక్కాడు. కానీ, కాసేపటికే అదుపుతప్పి చెట్టుపైనుంచి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది. అతడి శరీరభాగాలను కొంతవరకు తినేసింది. దీంతో అతడు ప్రాణాలు ప్రాణాలు కోల్పోయాడు.
జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సింహం దాడిలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుర్జర్గా గుర్తించారు. దాడి తర్వాత సింహాన్ని ఎన్క్లోజర్లో అధికారులు బంధించారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు జూకి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్ రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.