టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి జట్టుకు దూరమయ్యాడు. అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్తో పాటు 2026 ఆసియా గేమ్స్లోనూ అతడు ఆడటం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న హర్షిత్.. సెప్టెంబర్ 7న నిర్వహించిన మ్యాచ్ సిమ్యులేషన్లో బౌలింగ్ చేస్తుండగా కుడి తొడ కండరాల్లోని రెక్టస్ ఫెమోరిస్కు స్ట్రెయిన్ ఏర్పడింది. దీంతో అతడిని రెండు టోర్నీల నుంచి తప్పించారు.
హర్షిత్ రాణా స్థానంలో విదర్భకు చెందిన 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో యశ్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్లు ఆడిన అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లోనూ యశ్ ఠాకూర్ మంచి రికార్డు కలిగి ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడి 81 వికెట్లు తీసుకున్నాడు. 7.04 ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో ఈ మ్యాచ్లు నిర్వహించనున్నారు. హర్షిత్ రాణా గాయం కారణంగా తప్పుకోవడంతో అతడి స్థానంలో వచ్చిన యశ్ ఠాకూర్పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. టీ20 సిరీస్లో లభించే అవకాశాన్ని యశ్ ఎలా ఉపయోగించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.