ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన 32వ ఒలింపిక్స్ క్రీడలు సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలైలోగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఏ మాత్రం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ ప్రభుత్వం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఒలింపిక్స్ను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని నేను ప్రతిపాదించాను.
ఐఓసీ అధ్యక్షుడు దానికి వంద శాతం అంగీకరిస్తున్నట్లు సమాధానమిచ్చారు’ అని జపాన్ ప్రధాని షింజో అబె ప్రకటించారు. తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నాలుగు వారాలు కావాలని ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన ఐఓసీ కూడా చివరకు సభ్య దేశాల ఒత్తిడితో తలొగ్గక తప్పలేదు. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం జరిగితే తాము కూడా పాల్గొనలేమంటూ ఒక్కో సభ్య దేశం ప్రకటిస్తుండటంతో ఐఓసీకి వాయిదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. 2021లో కచ్చితమైన తేదీలు ప్రకటించకపోయినా… 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం అనుకున్న తేదీల్లోపే (జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు) మెగా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది.
వాయిదా మొదటిసారి మాత్రమే!
1896లో తొలిసారి ఒలింపిక్స్ జరిగాయి. అప్ప టి నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించకుండా వాయిదా వేయడం ఇదే తొలిసారి. గతంలో 3 సార్లు ప్రపంచ యుద్ధాల సమయంలో అసలు ఒలింపిక్స్ జరగనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944లో జరగాల్సిన ఒలింపిక్స్ను రద్దు చేశారు.