పూణేకు చెందిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని చారిత్రక లోహగడ్ కోట వద్ద జూన్ 18న ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడి కేతన్ మరణించాడని మొదట అందరూ భావించారు. తన పుట్టినరోజు సందర్భంగా కాబోయే భర్త కేతన్తో కలిసి అక్కడికి వెళ్లిన అతని ప్రియురాలు (ఫియాన్సీ) సియా గోయల్ సైతం కేతన్ కాలు జారి పడిపోయాడని పోలీసులకు కట్టుకథ అల్లింది. కానీ, కేతన్ కుటుంబ సభ్యుల అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసుల విచారణలో ఇదొక పక్కా ప్రణాళికతో జరిగిన దారుణ హత్యగా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ మిస్టరీని ఛేదించడంలో అక్కడున్న సీసీటీవీ ఫుటేజీ అత్యంత కీలకంగా మారింది. పోలీసుల విచారణలో ఓ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. జూన్ నెలలో ఉష్ణోగ్రత దాదాపు 33 డిగ్రీల సెల్సియస్తో భగభగ మండుతుండగా.. ఫుటేజీలో కేతన్, సియాల వెనుక ఒక గుర్తుతెలియని వ్యక్తి ముఖం కనిపించకుండా ‘హుడీ’ (Hoodie) వేసుకుని, హెడ్ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా నడుచుకుంటూ వెళ్లడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఎండలు మండిపోతున్న అంత వేడి వాతావరణంలో హుడీ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు గుట్టు రట్టయింది.
సీసీటీవీలో కనిపించిన ఆ హుడీ వ్యక్తి పేరు చేతన్ చౌదరి అని, అతనికి సియాతో అప్పటికే రహస్య ప్రేమ వ్యవహారం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యులు నిశ్చయించిన కేతన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని సియా, తన ప్రియుడు చేతన్తో కలిసి ఈ దారుణమైన హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. పక్కా ప్లాన్ ప్రకారం ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి కేతన్ను తీసుకెళ్లి, వెనుకనుండి వచ్చిన చేతన్ సహాయంతో సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసి చంపేశారు. ఈ షాకింగ్ నిజాలు బయటపడటంతో పూణే పోలీసులు సియా గోయల్ మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.