జ‌గ‌న్ కు చంద్ర‌బాబు లేఖ‌..! ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు, పార్లమెంట్ సభ్యులకు కీలక విన్నపం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ కు మద్దతు తెలపాలని కోరుతూ ఆయన వివిధ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు లేఖలు రాశారు. మహిళా సాధికారత దిశగా దేశం వేస్తున్న ఈ అడుగుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన ఆ లేఖలో ఉద్ఘాటించారు.

 

ముఖ్యమంత్రి లేఖలు పంపిన వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు (33 శాతం) రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఏప్రిల్ 16వ తేదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన అభివర్ణించారు.

 

పరిపాలన, ప్రభుత్వం, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని చంద్రబాబు తన లేఖలో స్పష్టం చేశారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, అది మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి ఒక గొప్ప మార్గమని ఆయన కొనియాడారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర తమదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచడానికి ఉద్దేశించిన ఒక చారిత్రాత్మక చట్టం. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం (మూడో వంతు) స్థానాలను కేటాయించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే చట్టసభల్లో ప్రతి ముగ్గురు సభ్యులలో ఒకరు తప్పనిసరిగా మహిళా ప్రతినిధి ఉండాలి. ఈ 33 శాతం రిజర్వేషన్లలో ఎస్సీ (SC), ఎస్టీ (ST) మహిళలకు కూడా అంతర్గత రిజర్వేషన్లు ఉంటాయి.

 

ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్లు కేవలం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యసభ లేదా రాష్ట్ర విధాన పరిషత్తులకు ఇవి వర్తించవు. ప్రస్తుతానికి ఈ మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమలులో ఉంటాయి. ఆ తర్వాత అవసరమనిపిస్తే పార్లమెంట్ దీనిని పొడిగించవచ్చు.

 

ఈ బిల్లు చట్టంగా మారినప్పటికీ, ఇది వెంటనే అమలులోకి రాదు. దీని అమలుకు రెండు ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి కావాలి. దేశవ్యాప్తంగా కొత్త జనాభా గణన జరగాలి. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి. ఆ తర్వాతే ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలో నిర్ణయిస్తారు.

 

మహిళా రిజర్వేషన్ల కోసం దాదాపు 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. 1996లో దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారి దీనిని ప్రవేశపెట్టింది. చివరకు 2023 సెప్టెంబర్‌లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇప్పుడు దీని అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *