దేశవ్యాప్తంగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాధారణంగా మార్చిలో వాతావరణం కాస్త చల్లగా ఉండేది. ఈసారి ఫిబ్రవరి చివరి నుంచి వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎండ తీవ్రత అమాంతంగా పెరిగింది. రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ- APSDMA అంచనా వేసింది.
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈసారి గరిష్టంగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఏపీలో బుధవారం అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 38.5 డిగ్రీలు నమోదెంది. ఇక నందిగామ, అమరావతి, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 37 డిగ్రీలు దాటేసింది.
ఏపీలో ఆ జిల్లాలకు అలర్ట్, ఆపై వేడి గాలులు
ఇక కళింగపట్నం, కాకినాడ, నరసాపురం వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో వేడి పెరిగే అవకాశం ఉంది. ఉక్క పోత పెరుగుతున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అటు రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీఎస్డీఎంఏ తెలిపిన వివరాల మేరకు ఈ ఏడాది మార్చి నుంచి సాధారణం కంటే ఎక్కవగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండవచ్చు, వేడి గాలులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. రాష్ట్ర స్థాయి అత్యవసర కార్యకలాపాల కేంద్రం 24 గంటలు పర్యవేక్షిస్తోందని తెలియ జేసింది. జిల్లా యంత్రాంగాలను రెండు రోజుల ముందుగానే వడగాలుల గురించి అప్రమత్తం చేసింది. ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఎండల సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని కోరింది. విపత్తుల సంస్థ నుంచి ప్రజలకు వడగాలుల సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే ఎండ సమయంలో బయటకు వెళ్లినప్పుడు దాని ప్రభావానికి గురికాకుండా ఉండేలా గొడుగు కచ్చితంగా తీసుకెళ్లాలని తెలిపింది. తెలుపు, పలుచని కాటన్ దుస్తులు ధరించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లో ఉండాలని తెలియజేసింది. డీహైడ్రేట్ బారినపడకుండా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు, మజ్జిగ తీసుకోవాలని పేర్కొంది.