అసోం సీఎం హిమంతపై అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు: ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ సీపీకి లేఖ

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక వర్గం వ్యక్తులను తుపాకీతో కాలుస్తున్నట్లు ఉన్న హింసాత్మక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను హిమంతపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ వీడియో జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి పోస్టులు చేస్తున్నారని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. అసోం సీఎం ఉద్దేశపూర్వకంగానే ముస్లింలను టార్గెట్ చేస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. వివాదాస్పదంగా మారిన సదరు వీడియోను విమర్శలు రావడంతో బీజేపీ తొలగించినప్పటికీ, దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా బహిరంగ సభలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా హిమంత గత కొన్నేళ్లుగా ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని ఫిర్యాదు లేఖలో స్పష్టం చేశారు.

జాతి విద్వేష ప్రసంగాలు (Hate Speech) కొందరికి అలవాటుగా మారిందని, ఇది దేశ శాంతిభద్రతలకు ముప్పు అని ఒవైసీ పేర్కొన్నారు. హిమంత బిశ్వ శర్మపై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు అంశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మతపరమైన ఉద్రిక్తతలు పెంచేలా ప్రవర్తించే ఎవరినైనా ఉపేక్షించకూడదని ఆయన పోలీసులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *